చెన్నై: తోటి మహిళా నాయకురాలిని అసభ్యంగా దూషించిన బీజేపీ నేతను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. ఆరు నెలల పాటు పార్టీ అన్ని పదవుల నుంచి ఆయనను తొలగించింది. తమిళనాడు రాష్ట్ర ఓబీసీ విభాగం బీజేపీ నాయకుడు సూర్య శివ, ఆ పార్టీ మైనారిటీ విభాగానికి చెందిన మహిళా నాయకురాలు డైసీ సరన్పై ఇటీవల అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఆమెను నరికేందుకు గుండాలను పంపుతానని, ఆమె ప్రైవేట్ భాగాలు కోసి మెరీనా బీచ్లో పడేస్తానని హెచ్చరించారు. అంతేగాక ఆమెపై అసభ్యకరమైన లైంగిక వ్యాఖ్యలు కూడా చేశారు.
కాగా, ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో గురువారం వారిద్దరూ పార్టీ క్రమ శిక్షణా కమిటీ ముందు హాజరయ్యారు. ఇద్దరి మధ్య రాజీ కుదిరినప్పటికీ సూర్య శివపై క్రమ శిక్షణా చర్యలు తీసుకున్నారు. ఆయనను ఆరు నెలల పాటు పార్టీ అన్ని పదవుల నుంచి సస్పెండ్ చేశారు.
మరోవైపు సస్పెండైన సూర్య శివ పార్టీ వాలంటీర్గా కొనసాగవచ్చని తమిళనాడు బీజేపీ చీఫ్ కే అన్నామలై సూచించారు. ఆయన ప్రవర్తనలో మార్పు వస్తే, పార్టీకి నమ్మకం కలిగితే పదవీ బాధ్యతలు తిరిగి వస్తాయని తెలిపారు. ఇలాంటి విషయాలను తమ పార్టీ తేలికగా తీసుకోదని చెప్పారు. కాగా, డీఎంకే సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ తిరుచ్చి శివ కుమారుడైన సూర్య శివ, ఈ ఏడాది మేలో బీజేపీలో చేరారు.