చెన్నై: బస్సు ఫుట్బోర్డ్ వద్ద ప్రమాదకరంగా వేలాడుతూ ప్రయాణించిన విద్యార్థులను బీజేపీ నాయకురాలు తిట్టడంతోపాటు కొట్టింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. ప్రభుత్వ బస్సులో ప్రయాణించిన స్కూల్ విద్యార్థులు ఫుట్బోర్డ్ వద్ద వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణించారు. కారులో వెళ్తున్న బీజేపీ నాయకురాలు, నటి రంజనా నాచ్చియార్ (Ranjana Natchiyaar) ఇది చూసింది. వెంటనే కారు నుంచి దిగి ప్రభుత్వ బస్సును ఆపింది. డ్రైవర్కు చీవాట్లు పెట్టింది. అనంతరం ఫుట్బోర్డ్ వద్ద ప్రమాదకరంగా ప్రయాణించిన విద్యార్థుల వద్దకు ఆమె వెళ్లింది. కుక్కలు అంటూ వారిని తిట్టడంతోపాటు కిందకు దిగాలని డిమాండ్ చేసింది. నిరాకరించిన కొందరు విద్యార్థులను కొట్టి బలవంతంగా బస్సు నుంచి కిందకు దించివేసింది.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు రంజనాపై పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం ఆమె ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. అయితే బీజేపీ నేత సీటీ రవి ఆమె అరెస్ట్ను ఖండించారు. రంజనాను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేయాల్సింది ఆమెను కాదని, పిల్లలు తమ ప్రాణాలను రిస్క్ చేసి ప్రమాదకరంగా బస్సులో ప్రయాణించినందుకు సీఎం, రవాణా మంత్రి, రవాణా అధికారులను అరెస్ట్ చేయాలంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు.
BJP leader Ranjana Natchiyaar booked by Tamil Nadu police reportedly for stopping a school bus and slapping a few students doing stunts pic.twitter.com/mBFU4Kmhpw
— Organiser Weekly (@eOrganiser) November 4, 2023