చెన్నై, నవంబర్ 18: తమిళనాడులో సీఎం స్టాలిన్, గవర్నర్ రవి మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్కు పంపగా ఆయన తిరిగి ప్రభుత్వానికి పంపారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సీఎం స్టాలిన్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ 10 బిల్లులను తిరిగి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించడానికి ప్రభుత్వం పలు బిల్లులను తీసుకొచ్చి, ఆమోదించి గవర్నర్కు పంపితే ఆయన తిరిగి పంపారని చెప్పారు.
ప్రభుత్వం చొరవను, లక్ష్యాలను కావాలనే అడ్డుకుంటున్నట్టు తెలుస్తున్నదని తెలిపారు. ఈ 10 బిల్లులలో కొన్ని రెండేండ్ల నుంచి ఆమోదానికి నోచుకోకుండా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే సూచించి తిరిగి పంపితే బాగుండేదని, కానీ ఎలాంటి కారణాలు చెప్పకుండానే బిల్లులు తిరిగి పంపితే ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నట్టు అర్థమవుతున్నదని స్టాలిన్ పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిన గవర్నరే ఇలా వ్యవహరించడం సరికాదని తెలిపారు. అయినప్పటికీ తమకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై గౌరవం ఉన్నదని, అందుకే గవర్నర్ పంపిన 10 బిల్లులను తిరిగి అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. అనంతరం సభ నుంచి బీజేపీ, అన్నాడీఎంకే వాకౌట్ చేయగా.. సభ ఈ 10 బిల్లులను ఆమోదించింది.
గవర్నర్ల ద్వారా రాష్ర్టాలపై కేంద్రం పెత్తనం చెలాయించాలని చూస్తున్నదని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రతిపక్ష పాలిత రాష్ర్టాలే లక్ష్యంగా ఈ తతంగం నడుస్తున్నదని తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం తన వైఖరిని మార్చుకోవాలని లేకుంటే సమయం వచ్చినప్పుడు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.