చెన్నై, అక్టోబర్ 18: తమిళనాడుపై బలవంతంగా హిందీ భాషను రుద్దడానికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర శాసనసభ మంగళవారం ఓ తీర్మానం చేసింది. అధికార భాషలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ నివేదికలోని సిఫారసులను అమలు చేయవద్దని ఆ తీర్మానంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సెప్టెంబర్ 9న రాష్ట్రపతికి ఈ కమిటీ నివేదించిన సిఫారసులు తమిళంసహా ఇతర రాష్ర్టాల భాషలకు, వాటిని మాట్లాడే ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ సీఎం ఎంకే స్టాలిన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
గతంలో ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై ప్రవేశపెట్టిన ద్విభాషా విధాన తీర్మానాన్ని ఇదే సభ ఆమోదించిన విషయాన్ని అందులో గుర్తు చేశారు. ఈ తీర్మానంతోపాటు హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ర్టాలకు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇచ్చిన హామీకి పార్లమెంటరీ కమిటీ సిఫారసులు వ్యతిరేకంగా ఉన్నాయని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. దీన్ని అసెంబ్లీ ఆమోదించింది.