National Flag | స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా అట్టహాసంగా కొనసాగుతున్నాయి. తమిళనాడులోని కోయంబత్తూర్కు చెందిన ఓ సామాజిక కార్యకర్త తనకున్న దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నారు. తన కుడి కన్నులో జాతీయ జెండాను చిత్రీకరించి స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగస్వామి అయ్యారు.
కోయంబత్తూరులోని కునియంతూర్కు చెందిన యూఎంటీ రాజా సామాజిక కార్యకర్తగా కొనసాగుతున్నాడు. మినీయేచర్ ఆర్టిస్ట్ కూడా. అయితే స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా తన కనుగుడ్డుపైనే జాతీయ జెండాను చిత్రీకరించాడు. ఈ జెండాను చిత్రీకరించేందుకు కొన్ని గంటల సమయం పట్టింది. 16వ ప్రయత్నంలో సఫలీకృతుడయ్యాడు. మొదట కనుగుడ్డులోని తెల్లసొన పలుచని పొరకు మైనంతో త్రివర్ణ పతాకం రంగులను పూశాడు. ఆ తర్వాత దాదాపు 20 నిమిషాల పాటు కంటిలో ఆ పెయింట్ను ఉంచాడు. ఆ పెయింట్ కనుగుడ్డుపై ప్రింట్ అయిన తర్వాత తొలగించాడు. ఈ ఫీట్ కోసం రాజా కంటి డాక్టర్ సలహా తీసుకున్నాడు. అయితే ఇలాంటి ప్రయోగం ఎవరూ చేయొద్దని రాజా విజ్ఞప్తి చేశాడు.