Bulldozer action | బుల్డోజర్లు పెట్టి ఇళ్లను కూల్చివేయడంపై బిహార్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో బిహార్ పోలీసులకు చురకలంటించింది. ల్యాండ్ మాఫియా కారణంగా ఓ మహిళ ఇంటిని కూల్చివేసిన కేసులో ‘బుల్డోజర్ కూల్చివేతలు తమాషాగా మారాయి’ అని వ్యాఖ్యానించింది. ఇక్కడ కూడా బుల్డోజర్లు నడపడం మొదలుపెట్టారా? అంటూ ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ఆటవిక చర్యలను కోర్టు ఉటంకించింది.
పోలీసులు ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. రాష్ట్రానికా? లేదా కొంతమంది ప్రైవేట్ పబ్లిక్కా? అని ప్రశ్నించింది. ఇళ్లను కూల్చివేస్తుంటే చూస్తూ కూర్చున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ ఇంటిని తప్పుగా ధ్వంసం చేసినట్లు తేలితే సంబంధిత అధికారి జేబులో నుంచి రూ.5లక్షలు పరిహారంగా చెల్లించేలా చూస్తానని కేసును విచారించిన న్యాయమూర్తి చెపపారు. ల్యాండ్ మాఫియాతో పోలీసులు కుమ్మక్కై ఇళ్లను కూల్చివేస్తున్నారంటూ విచారం వ్యక్తం చేసిన పాట్నా హైకోర్టు.. ఈ కేసులో స్వయంగా హాజరై సమాధానం ఇవ్వాలని సీనియర్ పోలీసు అధికారులను జస్టిస్ కుమార్ ఆదేశించారు.
ఈ కేసు నవంబర్ 24 న విచారణకు వచ్చింది. అయితే దీనికి సంబంధించిన వీడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ కేసులో పోలీసు నివేదికను అధ్యయనం చేసిన కోర్టు, రాష్ట్ర పోలీసులు చట్టవిరుద్ధంగా ఇంటిని కూల్చివేసినట్లు కనిపిస్తున్నదని, కొంతమంది ల్యాండ్ మాఫియాతో అధికారులు చేతులు కలిపినట్లుగా కనిపిస్టున్నదని జస్టిస్ కుమార్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మాదిరిగానే ఇక్కడ కూడా బుల్డోజర్లను వాడటం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఏడాది తొలుతలో జరిగిన మత ఘర్షణల అనంతరం ఢిల్లీలోని మైనారిటీలు ఎక్కువగా నివసించే ప్రాంతాలకు బుల్డోజర్లను ఢిల్లీలోని బీజేపీ నియంత్రణలో ఉన్న పౌర సంఘం పంపింది.