న్యూఢిల్లీ : నేటి నుంచి వెన్నెల వెలుగుల్లో తాజ్మహల్ను ( Taj Mahal ) వీక్షించొచ్చు. రాత్రి వేళల్లో తాజ్మహల్ను వీక్షించేందుకు సందర్శకులకు అనుమతి లభించింది. కరోనా వల్ల గతేడాది మార్చి నెలలో రాత్రి వేళల్లో తాజ్మహల్ సందర్శనను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 17 నెలల తర్వాత తాజ్మహల్ రాత్రి సందర్శనకు అనుమతి రావడంతో పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వారంలో శుక్ర, ఆదివారాలు మినహా తాజ్మహల్ రాత్రి సందర్శనకు అనుమతి ఉంటుంది.
పర్యాటకుల కోసం మూడు స్లాట్లను అందుబాటులోకి తెచ్చారు. రాత్రి 8:30 నుంచి రాత్రి 10 గంటల వరకు అర గంట చొప్పున మూడు స్లాట్లు ఉన్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ప్రతి స్లాట్లో 50 మంది పర్యాటకులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ టికెట్లను పొందేందుకు ఆగ్రాలోని 22 మాల్ రోడ్డులోని ఏఎస్ఐ ఆఫీస్ కౌంటర్ను సందర్శించాలి.