ఆగ్రా: చైనా, జపాన్, దక్షిణ కొరియా సహా పలు దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. ఒమిక్రాన్ బీఎఫ్-7 రకం కరోనా వైరస్ కారణంగా పలు దేశాల్లో రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం దేశంలోనూ ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ కలకలం రేపింది. గుజరాత్లో ఇద్దరిలో, ఒడిశాలో ఒక్కరిలో ఒమిక్రాన్ బీఎఫ్-7 రకం కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు.
దాంతో కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ఎయిర్పోర్టుల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో దేశంలోని సుప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన తాజ్మహల్ పరిసరాల్లో కూడా కొవిడ్ అలర్ట్ ప్రకటించారు. తాజ్ మహల్ సందర్శనకు వచ్చే పర్యాటకులకు కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి చేశారు.
దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు అందరికీ ఈ నియమం వర్తిస్తుందని ఆగ్రా జిల్లా వైద్యాధికారి అనిల్ సత్సంగి తెలిపారు. ఆగ్రా జిల్లాలో కొవిడ్ మరింత విస్తరించకుండా ఇప్పటికే పరీక్షలు ప్రారంభించామని చెప్పారు. తాజా నిబంధన ప్రకారం.. తాజ్మహల్ను సందర్శించాలనుకునే పర్యాటకులు కరోనా పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి అయ్యింది.