న్యూఢిల్లీ, మే 17: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో తనపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ కీలక విషయాలను వెల్లడించారు. ‘నేను ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్లినప్పుడు బిభవ్ కుమార్ నాపైకి ఒక్కసారిగా దూసుకొచ్చి ఏడెనిమిది సార్లు బలంగా కొట్టాడు. నన్ను లాగేయడంతో టేబుల్కు నా తల తగిలి కింద పడిపోయాను. కావాలని నా చొక్కా పైకి లాగాడు. నా చొక్కా గుండీలు ఊడిపోయాయి. నా కడుపు, పొత్తి కడుపు, ఛాతిపై తన్నాడు. నేను పీరియడ్లో ఉన్నానని, నొప్పి భరించలేకపోతున్నానని చెప్పినా వినకుండా దాడి చేశాడు.’ అని స్వాతి ఫిర్యాదు చేశారు. మరోవైపు, సీఎం నివాసంలోకి అనధికారికంగా ప్రవేశించేందుకు మలివాల్ యత్నించారని, తనను దూషించారంటూ ఆమెపై బిభవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీసీటీవీ ఫుటేజ్ వైరల్
కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మలివాల్ సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన 52 సెకన్ల సీసీటీ ఫుటేజ్ వైరల్గా మారింది. ఈ వీడియోపై స్వాతి మలివాల్ స్పందించారు. ప్రతిసారిలాగే ఈసారి కూడా ‘రాజకీయ హిట్మాన్’ తనను తాను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆమె ఆరోపించారు. అయితే, ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనేది బయటపెట్టలేదు.
బీజేపీ కుట్ర: ఆతిశీ
వైరల్ అయిన వీడియో ద్వారా మలివాల్ అబద్ధం చెప్తున్నట్టు బహిర్గతమైందని ఆప్ నేత ఆతీశీ పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్లో తనను కొట్టారని మలివాల్ ఆరోపించారని, కానీ వీడియోలో ఇందుకు పూర్తి భిన్నంగా ఉందన్నారు. ఆమెనే సెక్యూరిటీ సిబ్బందిని బెదిరిస్తున్నట్టుగా వీడియోలో ఉందని, ఆమె చెప్తున్నట్టు బట్టలు కూడా చినిగిపోయిలేవని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారం.. కేజ్రీవాల్ను ఇరికించేందుకు బీజేపీ పన్నిన కుట్రగా స్పష్టమవుతున్నదని, ఇందులో మలివాల్ కీలక భాగస్వామి అని ఆమె పేర్కొన్నారు. ఆతిశీ ఆరోపణలను మలివాల్ ఖండించారు.