UP Polls | బీజేపీ నుంచి ఇటీవలే సమాజ్వాదీలో చేరిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య విషయంలో సమాజ్వాదీ కీలక నిర్ణయం తీసుకుంది. తన సిట్టింగ్ స్థానాన్ని మార్చేసింది. ప్రతి సారీ స్వామి ప్రసాద్ మౌర్య పడ్రౌనా నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. ఈ సారి మాత్రం ఈ స్థానం నుంచి కాకుండా మరో స్థానం నుంచి పోటీ చేయించాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా గమనించాల్సిన అంశం. ఈ ఎన్నికల్లో స్వామి ప్రసాద్ మౌర్య ఫాజిల్ నగర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆర్పీఎన్ సింగ్ను దృష్టిలో పెట్టుకొనే సమాజ్వాదీ పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకుందన్న వాదన ఒకటి వినిపిస్తోంది. అంతేకాకుండా ఫాజిల్ నగర్ స్థానం రాజకీయంగా అత్యంత బలీయమైన స్థానం కూడా. రాజకీయ సమీకరణాలను మార్చే నియోజకవర్గం ఇది. ఈ పాయింట్ను కూడా సమాజ్వాదీ పరిగణనలోకి తీసుకుందని సమాచారం.
ఫాజిల్నగర్ అనే నియోజకవర్గం బీజేపీకి పెట్టని కోటగా కొనసాగుతూ వస్తోంది. గత పది సంవత్సరాలుగా ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థే గెలుపొందుతూ వస్తున్నారు. అయితే దీని కంటే ముందు సమాజ్వాదీ పార్టీకి కూడా ఇది పెట్టని కోటే. ఇక్కడ కుశ్వాహ ఓట్లతో పాటు ముస్లింల ఓట్లు కూడా కీలక పాత్రే పోషిస్తాయి.
స్వామి ప్రసాద్ మౌర్య ఎప్పుడైతే బీజేపీని వీడి, సమాజ్వాదీలో చేరారో.. అప్పుడే బీజేపీ ఖంగుతిన్నది. దీనికి ప్రతిచర్యగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్పీఎన్ సింగ్ను బీజేపీలో చేర్చుకుంది. దీంతో పడ్రౌన్ నియోజకవర్గం రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక.. ప్రజా వ్యతిరేకత ఎక్కడ తనపై పడుతుందన్న భయంతో కూడా స్వామి ప్రసాద్ మౌర్య ఈ సారి పడ్రౌన్ను వీడి, ఫాజిల్ నగర్ నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు ఓ వర్గం పేర్కొంటోంది. మూడు లక్షల 50 వేలకు పైగా ఇక్కడ ఓటర్లు ఉన్నారు. అందులో 10 శాతం బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లు, 7 శాతం క్షత్రియ సామాజిక వర్గం ఓట్లు, 8 శాతం వైశ్యుల ఓట్లున్నాయి. ఇక 14 శాతం ముస్లింల ఓట్లు, 5 శాతం యాదవులు, 10 శాతం కుశ్వాహ సామాజికవర్గపు ఓట్లున్నాయి.