హనోయ్ (వియత్నాం), జనవరి 31: వియత్నాంలోని సైగన్ కమర్షియల్ బ్యాంక్ (ఎస్సీబీ)లో తన రిటైర్మెంట్ సేవింగ్స్ దాచుకున్న ఒక మాజీ నర్సు డబ్బు డ్రా చేయడానికి వెళ్లింది. బ్యాంక్ సిబ్బంది మాటలు విని ఆమె షాక్ తిన్నది. బ్యాంకులో డబ్బు లేదని, ఆమెకు చెందిన డబ్బు విత్ డ్రా చేయడానికి అనుమతించలేమంటూ బ్యాంక్ అధికారులు నిస్సహాయత వ్యక్తం చేశారు. ఇది ఆ ఒక్క నర్సు వ్యథ కాదు. వియత్నాంలోని వేలాది మంది ప్రజలు గత రెండేండ్లుగా తమ డబ్బులు అందక హాహాకారాలు చేస్తున్నారు. బ్యాంకుకు ఈ పరిస్థితి రావడానికి ఒకే ఒక్క మహిళ కారణమంటే ఆశ్చర్యం కలగకమానదు. ప్రాపర్టీ వ్యాపారవేత్త ట్రుయాంగ్ మై లాన్ వియత్నాం దేశంలో అతి భారీ బ్యాంక్ మోసానికి పాల్పడ్డారు. 12.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.లక్ష కోట్లు) ఇన్వెస్టర్ల సొమ్మును ఆమె కాజేసింది.
బ్యాంకులో 90 శాతం వాటాదారైన ఆమె లక్షలాది నకిలీ లోన్ ఖాతాలు సృష్టించి కోట్లాది రూపాయలను రుణం పేరుతో కాజేసింది. తీరా ఆ మొత్తం తిరిగి వసూలు కాకపోవడంతో ఇప్పుడు బ్యాంకు దివాలా దిశగా ఉంది. దీంతో అందులో డబ్బులు దాచుకున్న ఖాతాదారులు దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. తమ ఖాతాల నుంచి సొ మ్మును కానీ, వడ్డీని కానీ 2022 నుం చి డ్రా చేసుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 2019 నుంచి 2022 మధ్య ఆమె డ్రైవర్ 4.4 బిలియన్ డాలర్ల నగదును ఎస్సీబీ నుంచి తన ఇంటికి వాహనం ద్వారా తరలించినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 42 వేల మంది బాధితులను గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. హాంకాంగ్కు చెందిన ఒక ధనవంతుడైన వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న ట్రుయాంగ్ మై లాన్ వియత్నాం 2022 జీడీపీలో మూడు శాతం విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు.