బెంగళూరు/న్యూఢిల్లీ, జూలై 25: కర్ణాటక సీఎం మార్పుపై సస్పెన్స్ కొనసాగుతున్నది. తాను పదవిలో ఉండాలా? వద్దా? అనేదానిపై నిర్ణయం సోమవారం ఉదయం తెలుస్తుందన్న సీఎం బీఎస్ యెడియూరప్ప ప్రకటనతో కర్ణాటక రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. పదవి ఉన్నా లేకపోయినా మరో 10-15 ఏండ్లు బీజేపీ కోసం పనిచేస్తానని ఆయన చెప్పారు. రెండు దశాబ్దాలుగా కన్నడనాట బీజేపీలో చక్రంతిప్పుతున్న 78 ఏండ్ల యెడియూరప్పను మారుస్తారని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతున్నది. ఇటీవల ఆయన ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వచ్చారు. ఆదివారం సాయంత్రానికల్లా యెడియూరప్ప భవితవ్యం తేలుతుందని పార్టీ నాయకులు భావించినా ఆలస్యమైంది. అధిష్ఠానం నుంచి ఇంకా ‘మెసేజ్’ రావాలని, రాత్రికి గానీ లేదా సోమవారం ఉదయం గానీ వస్తుందని ఆయన తెలిపారు. సోమవారం ఆయన ప్రభుత్వం రెండో వార్షికోత్సవ సభ జరుగనున్నది. ‘ఆ సభలో ప్రభుత్వ విజయాల గురించి మాట్లాడుతా. దాని తర్వాత మిగతా విషయాలు మీకు తెలుస్తాయ’ని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ కేంద్ర నాయకత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, పార్టీ గీసిన ‘గీత’ దాటనని చెప్పారు. రాజీనామా చేయమని అధిష్ఠానం ఆదేశిస్తే రాజీనామా చేస్తా, సీఎంగా కొనసాగమంటే కొనసాగుతానన్నారు. మరోవైపు, యెడియూరప్ప బాగా పనిచేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశంసించారు.
రేసులో బీఎల్ సంతోష్
కర్ణాటక సీఎంగా యెడియూరప్ప స్థానంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) బీఎల్ సంతోష్ పేరును పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు. రాష్ట్ర జనాభాలో బ్రాహ్మణులు 2 శాతం మంది ఉన్నారు. కుల సమీకరణలను బ్యాలెన్స్ చేసేందుకు లింగాయత్, వొక్కలిగ, ఓబీసీ, ఎస్సీ/ఎస్టీ వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం. కర్ణాటకలో ప్రస్తుతం ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. వారిలో లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్ సువాడిని కొనసాగించే అవకాశం ఉంది. వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం సీఎన్ అశ్వత్థ్ నారాయణ్ స్థానంలో మాజీ సీఎం డీవీ సదానంద గౌడకు అవకాశం ఇవ్వొచ్చు. ఇటీవల కేంద్ర క్యాబినెట్ విస్తరణలో సదానంద గౌడ పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఓబీసీ క్యాటగిరీలో రూపాలీ నాయక్కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని భావిస్తున్నారు. నాలుగో డిప్యూటీ సీఎం పదవి ఎస్సీ లేదా ఎస్టీలకు చెందిన వ్యక్తికి ఇవ్వొచ్చని సమాచారం.