GUJARAT | న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు తమ రాజకీయ, సామాజిక అభిప్రాయాలను ఆన్లైన్లో వ్యక్తపరిచేందుకు భయపడుతున్నారని తాజా సర్వేలో వెల్లడైంది. ఎన్జీవోలు కామన్కాజ్, లోక్నీతి, సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) ఈ సర్వే నిర్వహించాయి. ‘స్టేటస్ ఆఫ్ పోలిసింగ్ ఇన్ ఇండియా-2023’ పేరుతో సర్వే నివేదికను రూపొందించాయి.
గుజరాత్లో ఇంటర్నెట్ యూజర్ల అభిప్రాయాలను అందులో పొందుపరిచారు. ఆన్లైన్లో తమ రాజకీయ అభిప్రాయాలను వ్యక్తపరిచేందుకు 33 శాతం మంది జంకుతున్నారని, న్యాయపరమైన చర్యలు ఎదుర్కొనాల్సి వస్తుందన్న భయమే ఇందుకు కారణమని సర్వేలో తేలింది. గుజరాత్లో ఒకే పార్టీ దశాబ్దాలుగా అధికారంలో ఉండటం, నిరంకుశ పాలన కారణంగా ప్రజలు తమ రాజకీయ అభిప్రాయాలు వెల్లడించేందుకు భయపడుతున్నారని లోక్నీతి గుజరాత్ కోఆర్డినేటర్ మహాశ్వేత జాని అభిప్రాయపడ్డారు.
దేశంలోనే అత్యధికంగా గాంధీనగర్లోనే ఎక్కువ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని సర్వేలో తేలింది. సర్వేలో భాగంగా.. రాజకీయాలు, సామాజిక అంశాలపై తాము చేసిన పోస్టుల వల్ల న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనాల్సి వస్తుందని భయపడుతున్నారా అని అడగ్గా, 33 శాతం మంది చాలా భయపడుతున్నామని సమాధానమిచ్చారు. కాస్త భయపడుతున్నట్టు 46 శాతం మంది అభిప్రాయపడగా, 9శాతం మంది పెద్దగా భయమేమీ లేదని బదులిచ్చారు. కేవలం 8 శాతం మంది మాత్రమే తమకు ఎలాంటి భయం లేదని పేర్కొన్నారు.