అహ్మదాబాద్: జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో రాముడి విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠాపన జరుగనున్నది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రాముడు, రామాయణ పురాణ గాథకు సంబంధించిన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. (Ramayana On Ladies Hands ) ఇందులో భాగంగా గుజరాత్లోని సూరత్కు చెందిన ప్రఖ్యాత హెన్నా కళాకారిణి నిమిషా పరేఖ్ తన వంతుగా రాముడ్ని తరించేందుకు చొరవ చూపింది. సూరత్లోని 51 మంది మహిళల చేతులపై మెహందీని ఉపయోగించి రామాయణంలోని ముఖ్య సంఘటనలను చిత్రీకరించింది. పురాతన వార్లీ ఆర్ట్ టెక్నిక్ను దీని కోసం వినియోగించింది.
కాగా, అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం ద్వారా తాను ఈ స్ఫూర్తిని పొందినట్లు హెన్నా ( మెహందీ) కళాకారిణి నిమిషా పరేఖ్ తెలిపింది. గత సంవత్సరం నిర్మాణంలో ఉన్న రామమందిరాన్ని సందర్శించినట్లు ఆమె చెప్పింది. ఆలయం గొప్పతనానికి ముగ్ధురాలైన తాను గోరింటాకు కళ ద్వారా రామాయణంలోని సారాంశాన్ని తెలియజేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ‘భారతీయ సంస్కృతికి సాటిలేని వచనం రామాయణం. సామాజిక ఆదర్శాలు, మానవ విలువలు, నైతికతను నొక్కి చెబుతుంది. గోరింటాకుతో కూడిన హెన్నా వంటి క్లిష్టమైన కళ ద్వారా రాముడు, సీత పట్ల భక్తిని ప్రదర్శించడమే మా లక్ష్యం’ అని ఆమె వెల్లడించింది.