న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీగా పోటీ చేయనున్న సినీ నటి కంగనా రనౌత్(Kangana Ranaut)పై కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాతే చేసిన పోస్టు వివాదాస్పదం అవుతున్నది. ఆ పోస్టు పట్ల జాతీయ మహిళా కమీషన్ క్షమాపణలు డిమాండ్ చేస్తోంది. రనౌత్ ఫోటోను సుప్రియా తన ఇన్స్టా అకౌంట్లో పోస్టు చేసి కామెంట్ చేసింది. అయితే ఆ పోస్టుపై వివాదం చెలరేగింది. ఆ పోస్టు పట్ల నటి కంగనా రనౌత్ రియాక్ట్ అయ్యింది. అనేక చిత్రాల్లో అనేక విభిన్న పాత్రలను పోషించినట్లు రనౌత్ పేర్కొన్నది. రజ్జో చిత్రంలో వేశ్యగా చేశానని, తలైవా చిత్రంలో విప్లవ నేతగా చేసినట్లు తెలిపింది.
మన కూతుళ్లను స్వేచ్ఛగా ఉంచాలని, ప్రతి మహిళను గౌరవించాలని రనౌత్ పేర్కొన్నది. అయితే కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాతే ఓ వీడియో ద్వారా క్లారిఫికేషన్ ఇచ్చింది. తనకు తెలియకుండా తన అకౌంట్ నుంచి పోస్టు జరిగినట్లు ఆమె చెప్పారు. తన ఫేస్బుక్, ఇన్స్టా అకౌంట్ అనేక మందికి యాక్సెస్లో ఉందని, ఎవరో ఒకరు తగని పోస్టు చేసి ఉంటారని ఆమె అన్నారు. మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు తానేమీ చేయనని సుప్రియా అన్నారు. దొంగ అకౌంట్ నుంచి అభ్యంతరకర పోస్టు వచ్చినట్లు ఆమె వెల్లడించారు. ట్విట్టర్ సంస్థకు ఆ అకౌంట్ గురించి ఫిర్యాదు చేసినట్లు సుప్రియా తెలిపారు.