Same-Sex Marriage | న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు చెప్పబోతున్నది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏప్రిల్ 18న ఈ అంశంపై విచారణ ప్రారంభించింది.
10 రోజులపాటు వాదోపవాదాలను విన్న తర్వాత మే 11న తీర్పును రిజర్వు చేసింది. విచారణలో కేంద్ర ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ, స్వలింగ పెండ్లిండ్లకు చట్టబద్ధత కల్పించడం సరైన చర్య కాదని తెలిపింది. దీని ప్రతికూల ప్రభావాన్ని కోర్టు ముందుగా ఊహించజాలదని, సరిదిద్దడం సాధ్యం కాదని వివరించింది.