న్యూఢిల్లీ, జూన్ 5 : నిర్దేశిత అర్హతలకు అనుగుణంగా అర్హులైన అభ్యర్థులకే ప్రభుత్వ ఉద్యోగాలు అందుబాటులో ఉండాలని సుప్రీంకోర్టు తెలిపింది. తక్కువ అర్హతలు ఉన్నవారి కోసం నిర్దేశించిన ఉద్యోగాన్ని ఎక్కువ అర్హతలు ఉన్న వ్యక్తికి కల్పించడం నిజంగా అర్హత, యోగ్యత ఉన్న అభ్యర్థికి నష్టం కలిగిస్తుందని పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. తాత్కాలిక బ్యాంకు సహాయకుడిని తిరిగి విధుల్లోకి తీసుకుంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేస్తూ జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర మహదేవన్తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 10వ తరగతి వరకు అర్హతలున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన పోస్టులో ఆ ఉద్యోగి తాను పట్టభద్రుడినన్న విషయాన్ని దాచిపెట్టి నియమాకం పొందారన్న అంశాన్ని హైకోర్టు విస్మరించిందని సుప్రీంకోర్టు పేర్కొన్నది.
ప్రభుత్వ ఉద్యోగాలు నిర్దేశించిన అర్హతలకు అనుగుణంగా అర్హులైన అభ్యర్థులందరికీ అందుబాటులో ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది. జీవన పరిస్థితుల కారణంగా ఉన్నత విద్యను అభ్యసించలేని వ్యక్తులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే అర్హతకు గరిష్ఠ పరిమితిని నిర్దేశించడం వెనుక ఉన్న హేతుబద్ధతని, ఇది న్యాయమైనది కూడానని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఆదర్శవంతమైన యజమానిగా రాష్ట్ర ప్రభుత్వం అటువంటి వ్యక్తుల కోసం కొన్ని క్యాటగిరీల పోస్టులను రిజర్వ్ చేయడం సమర్థనీయమే. తద్వారా ఉన్నత అర్హతలు గల అభ్యర్థులతో వారు పోటీ పడవలసిన అవసరం ఉండదు. అటువంటి విధానాన్ని న్యాయస్థానాలు కూడా సమర్థించాయి అని పేర్కొంటూ ఉద్యోగిని తొలగించాలన్న బ్యాంకు నిర్ణయాన్ని ధర్మాసనం సమర్థించింది.