Agusta Westland | అగస్టా వెస్ట్ల్యాండ్ వీవీఐపీ హెలీకాప్టర్ స్కామ్ కేసులో నిందితుడైన క్రిస్టియన్ మైఖేల్ జేమ్స్ బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. ఇప్పటికే కేసుల్లో సగం శిక్షను అనుభవించినందున బెయిల్పై విడుదల చేయాలన్న మిచెల్ జేమ్స్ విజ్ఞప్తిని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలా ధర్మాసనం తోసిపుచ్చింది. అయితే, కింది కోర్టులో ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నించవచ్చని పేర్కొంది.
యూపీఏ ప్రభుత్వ హయాంలో 12 హెలీకాప్టర్లను భారత వైమానికి దళానికి అప్పగించేలా రూ.3,600కోట్లతో ఒప్పందం కుదిరింది. అయితే, ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని, సుమారు రూ.480 కోట్లు చేతులు మారాయని తేలింది. ఈ వ్యవహారంపై సీబీఐతో పాటు ఈడీ వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి. ఈ కుంభకోణంలో మధ్యవర్తిగా ఉన్నాడనే ఆరోపణలపై బ్రిటన్ జాతీయుడైన క్రిస్టియన్ మైఖేల్ను దుబాయి 2018లో భారత్కు అప్పగించింది. దీంతో అప్పటి నుంచి కస్టడీలో ఉన్నాడు.
గతంలో ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మైఖేల్ బెయిల్ పిటిషన్లపై గత ఏడాది సుప్రీంకోర్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పందన కోరింది. బెయిల్పై విచారణ సందర్భంగా మైఖేల్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అండర్ ట్రయిల్ ప్రిజనర్ నిర్బంధానికి సంబంధించిన గరిష్ఠ పరిమితిని నిర్ధారించే సీఆర్పీసీ సెక్షన్ 436ఎ కేసు మైఖేల్పై నమోదైందని, క్లెయింట్ నేరారోపణలపై నేరానికి విధించే శిక్షలో 50 శాతం శిక్ష పూర్తిచేశాడని వాదించారు.
ఈ మేరకు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే, మైఖేల్పై విచారణ ఇంకా పూర్తి కాలేదని దర్యాప్తు సంస్థలు తెలిపాయి. ఇంతకు ముందు దర్యాప్తు సంస్థల తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ఏజెన్సీలు నిందితుడిని చాలా కష్టపడి అదుపులోకి తీసుకున్నాయని, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సెక్షన్ 463ఏ ఈడీ ప్రొసీడింగ్లకు వర్తించదని తెలిపారు.