న్యూఢిల్లీ: యోగా గురువు బాబా రాందేవ్కు చెందిన పతంజలి కంపెనీకి సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. హెర్బల్ ఉత్పత్తులపై తప్పుడు ప్రకటనలు చేయవద్దు అని కోర్టు తెలిపింది. తప్పుదోవ పట్టించే రీతిలో ఉత్పత్తులపై చేసే ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని పతంజలి కంపెనీని ఆదేశించింది. ఉత్పత్తులపై ఎటువంటి సమాచారం ఉన్నా చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. జస్టిస్ హసనుద్దిన్ అమానుల్లా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వేసిన పిటీషన్పై కోర్టులో వాదనలు జరిగాయి. తమ ఉత్పత్తులతో వ్యాధులు నయం అవుతాయని పతంజలి కంపెనీ కొన్ని ఉత్పత్తులపై ప్రింట్ చేస్తోంది. ఆ విధానాన్ని కోర్టు తప్పుపట్టింది. వ్యాక్సినేషన్, ఆధునిక మెడిసన్ గురించి రాందేవ్ కంపెనీ చేస్తున్న ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ ఐఎంఏ కోర్టును ఆశ్రయించింది.
ఆ కేసులో ఆగస్టు 23వ తేదీన కేంద్ర ఆరోగ్యశాఖ, ఆయుష్ శాఖలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉత్పత్తులపై వ్యాధులు నయం అవుతాయని రాస్తే, అప్పుడు ఆ ఒక్కొక్క ఉత్పత్తిపై కోటి ఫైన్ వేయనున్నట్లు కోర్టు వార్నింగ్ ఇచ్చింది.