న్యూఢిల్లీ: శబరిమల ఆలయంతో సహా మతపరమైన ప్రదేశాల్లో మహిళలపై వివక్షకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదోపవాదాలు వాడీవేడిగా సాగాయి. ఒకమతంలోని మూఢనమ్మకాన్ని విచారించే హక్కు, అధికార పరిధి తమకు ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పేర్కొనగా, ‘అలా ఎలా కుదురుతుంది.. ఒక ప్రాంతంలోని మతపరమైన ఆచారం మరొక ప్రాంతానికి మూఢనమ్మకంగా కనపడుతుంది. ఈ అంశాలు మీ పరిధిలోకి రావు’ అంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
రాజ్యాంగ ధర్మాసనం బుధవారం.. శబరిమల కేసు, వివిధ మతాల స్వేచ్ఛ పరిధి, విస్తృతి పిటిషన్లపై విచారణ చేపట్టింది. తుషార్ వాదనను జస్టిస్ అమానుల్లా తోసిపుచ్చారు. ‘శాసనసభ నిర్ణయమే అంతిమం అని మీరు చెప్పలేరు’ అని అన్నారు. ఆపై తుషార్ తన వాదనను కొనసాగిస్తూ, ‘నాగాలాండ్లో ఒక ఆచారం.. నాకు మూఢనమ్మకంగా కనిపించవచ్చు. మహారాష్ట్రలో బ్లాక్ యాక్ట్ ఉంది. అక్కడున్నది మూఢనమ్మకమేనని నిర్ధారించటం న్యాయస్థానం పరిధిలోని విషయం కాదు. ఆర్టికల్ 25(బి) ప్రకారం, ఈ విషయంలో జోక్యం చేసుకొని, చట్టాన్ని చేయాల్సిన బాధ్యత శాసనసభదే’నని అన్నారు. ఒక లౌకిక న్యాయస్థానం ఒక మతపరమైన ఆచారాన్ని కేవలం మూఢనమ్మకంగా నిర్ధారించలేదని మెహతా అన్నారు.