న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసును సుప్రీం కోర్టు బుధవారం విచారించనున్నది. ఈ నెల 3న హింసాకాండలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లీతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనున్నది. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఈ నెల 8న అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో ఇప్పటి వరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్తో సహా పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. హింసాత్మక ఘటనపై సీబీఐతో ఉన్నతస్థాయి న్యాయవిచారణ జరిపించాలని ఇద్దరు న్యాయవాదులు సీజేఐకి లేఖ రాశారు. ఈ మేరకు సుప్రీం కోర్టు కేసు విచారణ చేపట్టింది. ఈ నెల 3న యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన, కేంద్రం తీసుకువచ్చిన మూడు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న సమయంలో లఖింపూర్ ఖేరిలో వాహనంతో ఢీకొట్టడంతో నలుగురు రైతులు మృతి చెందారు.
దీంతో కోపోద్రిక్తులైన ఆందోళనకారులు వాహనం డ్రైవర్తో పాటు ఇద్దరు బీజేపీ కార్యకర్తలు చితకబాదడంతో మృతి చెందాడు. అలాగే ఓ పాత్రికేయుడు సైతం ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నెల 8న కేసు విచారణ సమయంలో సుప్రీం కోర్టు ఘటనకు బాధ్యులైన నిందితులను అరెస్టు చేయకపోవడంతో యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హత్యపై దర్యాప్తులో విశ్వాసం కలిగించేందుకు ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది. యూపీ ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది ఈ కేసులో అవసరమైన చర్యలు తీసుకుంటామని కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చారు.