లఖింపూర్ ఖీరీ (యూపీ), అక్టోబర్ 6: లఖింపూర్ హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టు స్పందించింది. కేసును సుమోటోగా స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం దీనిపై విచారణ జరుపనున్నది. మరోవైపు, కేంద్రమంత్రి అజయ్మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించాలని బీకేయూ నాయకుడు రాకేశ్ టికాయిత్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నలుగురు రైతుల మరణానికి కారణమైన వారిని అరెస్టు చేయాలన్నారు. వారంలోగా ఇవి జరుగని పక్షంలో దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతామని అల్టిమేటం జారీ చేశారు. ఇంకోవైపు, లఖింపూర్ ఖేరీ ఘటనను నిరసిస్తూ అక్టోబర్ 11 (సోమవారం) మహారాష్ట్ర బంద్కు అధికార ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ పార్టీలతో కూడిన ‘మహావికాస్ అఘాదీ’ పిలుపునిచ్చింది. కాగా, లఖింపూర్ ఖీరీలో రాజకీయ నేతలు పర్యటించేందుకు బుధవారం యూపీ సర్కారు అనుమతినిచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్గాంధీ, ప్రియాంకా గాంధీ.. మరణించిన రైతు కుటుంబాలను కలిసి పరామర్శించారు.
రైతులపై వ్యూహాత్మకంగానే దాడి జరిగినట్టు రాహుల్ ఈ సందర్భంగా ఆరోపించారు. లఖింపూర్ ఖీరీకి గురువారం ర్యాలీగా వెళ్లనున్నట్టు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ ప్రకటించారు. మరోవైపు, కేంద్రమంత్రి అజయ్మిశ్రా.. కేంద్ర హోంమంత్రి అమిత్షాను బుధవారం కలిశారు. అజయ్ మిశ్రా రాజీనామా చేయబోరని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదిలాఉండగా.. మృతిచెందిన నలుగురు రైతు కుటుంబాలతో పాటు మరణించిన జర్నలిస్టు కుటుంబానికి రూ. 50 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని పంజాబ్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు ప్రకటించాయి. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆదివారం నిరసనలు చేస్తున్న రైతులమీదకు కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించారు. అనంతర ఘర్షణల్లో జర్నలిస్టుతో పాటు మరో నలుగురు మృతి చెందారు.