న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, బీహార్ చీఫ్ సెక్రటరీలకు ఇవాళ సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. కోవిడ్ మృతులకు అందచేయాల్సిన నష్టపరిహారం కేసులో ఆ రెండు రాష్ట్రాలపై సుప్రీం సీరియస్ అయ్యింది. కోవిడ్ బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని గత తీర్పులో సుప్రీం ఆ రెండు రాష్ట్రాలను ఆదేశించింది. కానీ ఆ దిశగా ఆ రెండు రాష్ట్రాలు చర్యలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఏపీ, బీహార్లకు చెందిన చీఫ్ సెక్రటరీలు.. మధ్యాహ్నం 2 గంటలకు వర్చువల్ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. జస్టిస్ ఎంఆర్ షా, సంజివ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. చీఫ్ సెక్రటరీలు చట్టం కంటే ఎక్కువేమీ కాదు అని, ఆ ఇద్దరూ విచారణకు హాజరుకావాల్సిందే అని కోర్టు చెప్పింది. కోవిడ్తో మృతిచెందిన బాధిత కుటుంబాలకు 4 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని గతంలో కోర్టు ఆదేశించింది. ఎక్స్గ్రేషియా విషయంలో మార్గదర్శకాలను రూపొందించాలని గత ఏడాది జూన్లో ఎన్డీఎంఏను కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.