Udhayanidhi Stalin | న్యూఢిల్లీ: సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు యువజన సంక్షేమ, క్రీడల శాఖ మంత్రి, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ను సుప్రీంకోర్టు సోమవారం తీవ్రంగా మందలించింది. వాక్ స్వాతంత్య్రాన్ని, భావప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేశారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తనపై నమోదైన అన్ని కేసులను కలిపి విచారించాలంటూ ఎందుకు పిటిషన్ వేశారని ప్రశ్నించింది.
ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని, మంత్రిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో ఆలోచించాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం హెచ్చరించింది. ‘రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రాన్ని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను మీరు దుర్వినియోగం చేశారు.
ఇప్పుడు నేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు ఆర్టికల్ 32 ద్వారా లభించిన హక్కును ఉపయోగించుకుంటున్నారా? మీరేమీ సాధారణ వ్యక్తి కాదు. ప్రస్తుతం మీరొక మంత్రిగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ వ్యాఖ్యల వల్ల తలెత్తే పర్యవసానాలు ఏమిటో మీకు తెలియదా?’ అంటూ ధర్మాసనం నిలదీసింది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడైన ఉదయనిధి స్టాలిన్ గతేడాది సెప్టెంబర్లో ఓ సమావేశంలో మాట్లాడుతూ.. సనాతన ధర్మం కరోనా వైరస్, మలేరియా, డెంగ్యూ లాంటిదని.. సామాజిక న్యాయానికి, సమానత్వానికి విరుద్ధమైనదని.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.
దీంతో ఆయనపై వివిధ రాష్ర్టాల్లో పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఉదయనిధి వ్యాఖ్యలను తాను సమర్థించడం లేదని, ఆయనపై నమోదైన అన్ని కేసులను కలిపి విచారించాలని మాత్రమే కోరుతున్నానని ఆయన న్యాయవాది అభిషేక్ సింఘ్వీ సుప్రీం కోర్టును కోరారు.