Supreme Court | బైక్ టాక్సీ అందించే ఉబెర్, ర్యాపిడో సంస్థలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఢిల్లీలో ఉబెర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీ సేవలను అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఢిల్లీ సర్కారు కొత్త విధాన్ని రూపొందించే వరకు ద్విచక్ర వాహనాలను నడపొద్దని ఆయా సంస్థలను ఆదేశించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ సర్కారు కొత్తగా నోటీసు జారీ చేసింది.
ఢిల్లీలో బైక్-టాక్సీలు నడపకూడదని, ఉల్లంఘనలకు పాల్పడే అగ్రిగేటర్లకు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. వాణిజ్య అవసరాల కోసం ద్విచక్ర వాహనాలను ఉపయోగించడం మోటారు వాహనాల చట్టం-1988ని ఉల్లంఘించడమేనంటూ టూ వీలర్ ట్యాక్సీ సర్వీసులు అందించే సంస్థల్ని హెచ్చరించింది. ఢిల్లీ ప్రభుత్వంతో పాటు నగర పాలక సంస్థ జారీ చేసిన షోకాజ్ నోటీసును రాపిడో ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది.
ఆదేశాలు ప్రాథమిక, రాజ్యాంగ హక్కులను, సహజ న్యాయ సూత్రాలను ర్యాపిడో ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు కోర్టు ఢిల్లీలో బైక్-టాక్సీ అగ్రిగేటర్లు ర్యాపిడో, ఉబెర్ బైక్-టాక్సీ సేవలకు అనుమతి ఇచ్చింది. కొత్త విధానం తీసుకువచ్చే వారికి అగ్రిగేటర్లపై బలవంతపు చర్య తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, దీనిపై ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మే 26న సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకువచ్చే వరకు బైక్ టాక్సీ సేవలను నడపొద్దని ఆదేశించింది.