న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ భద్రతాలోపంపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. పంజాబ్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఇటీవల ఇచ్చిన తన ఆదేశాల్లో పేర్కొన్నట్టే కమిటీని వేసింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రాను ఈ కమిటీకి హెడ్గా నియమించింది. కమిటీలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, పంజాబ్ సెక్యూరిటీ డీజీపీ, పంజాబ్-హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్లు, చండీగఢ్ డీజీపీ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
ఈ నెల 5న పంజాబ్లోని ఫిరోజ్పూర్లో బీజేపీ ప్రచారసభలో పాల్గొనేందుకు ప్రధాని వెళ్లారు. ఈ సందర్భంగా రోడ్డు మార్గాన ఫిరోజ్పూర్కు వెళ్తుండగా కొందరు ఆయన కాన్వాయ్కు అడ్డుపడ్డారు. ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాదాపు 20 నిమిషాలపాటు ప్రధాని రోడ్డుపై వేచివున్నా పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ట్రాఫిక్ను క్లియర్ చేయలేక పోయారు. దాంతో ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు.
దీనిపై అప్పటి నుంచి తీవ్ర దుమారం కొనసాగుతున్నది. ప్రధానికి భద్రతాలోపం తలెత్తడాన్ని కేంద్రం సీరియస్గా తీసుకుంది. సెక్యూరిటీ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు విఫలమయ్యారని ఆరోపించింది. రాష్ట్రంలో తమ తప్పిదం ఏమీ లేదని సమర్థించుకుంది. అయితే పంజాబ్ డీజేపీ సహా కొందరు పోలీసులను ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేసింది. ఘటనపై దర్యాప్తునకు కేంద్రం, రాష్ట్రం రెండు కమిటీలను ఏర్పాటు చేశాయి.
చివరికి ఈ అంశం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ప్రధాని భద్రతాలోపంపై కేంద్ర కమిటీ దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగడంలేదని, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అధ్యక్షతన స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని పంజాబ్ ప్రభుత్వం అభ్యర్థించింది. దాంతో స్వతంత్ర కమిటీ ఏర్పాటుకు అంగీకరించిన సుప్రీంకోర్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దర్యాప్తుపై స్టే విధించింది. ఇవాళ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.