ముంబై: మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. అనుచిత ప్రవర్తన వల్ల వాళ్లను ఏడాది పాటు సస్పెండ్ చేస్తున్నట్లు మహా అసెంబ్లీ తెలిపింది. అయితే దీనిపై ఇవాళ తీర్పునిస్తూ.. అసెంబ్లీ సమావేశాల్లో ఆ సెషన్ను మించి సస్పెండ్ చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని, అది అక్రమం అవుతుందని సుప్రీం తెలిపింది. ఆ సస్పెన్షన్ను ఇవాళ కోర్టు రద్దు చేసింది. రూల్ ప్రకారం ఎమ్మెల్యేలను కేవలం ఆ సెషన్ వరకు మాత్రమే సస్పెండ్ చేయాలి. కానీ 12 మంది ఎమ్మెల్యేలను ఏడాది పాటు సస్పెండ్ చేయడం వివాదాస్పదమైంది.
మహారాష్ట్ర అసెంబ్లీలో గత ఏడాది జూలై 5వ తేదీ ఈ సస్పెన్షన్ జరిగింది. స్పీకర్ చాంబర్లో ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ భాస్కర్ జాదవ్తో బీజేపీ ఎమ్మెల్యేలు దరుసుగా వ్యవహరించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. సస్పెన్షన్కు గురైన వారిలో సంజయ్ కుటే, ఆశిశ్ శేఖర్, అభిమన్యు పవార్, గిరీశ్ మహాజన్, అతుల్ భట్కల్కర్, పరాజ్ అలవాని, హరీశ్ పింపలే, యోగేశ్ సాగర్, జయ కుమార్ రావత్, నారాయణ్ కుచే, రామ్ సత్పుతే, బంటీ బంగ్డియా ఉన్నారు.