Supreme Court | లైంగిక దాడి బాధితురాలి ‘కుండలి’ని పరిశీలించాలని అలహాబాద్ హైకోర్టు లక్నో యూనివర్సిటీ జోత్యిష్యశాస్త్రం విభాగాన్ని ఆదేశించింది. అయితే, ఈ ఆదేశాలపై శనివారం సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు లక్నో బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సుమోటోగా స్వీకరించిన కోర్టు.. ఈ కేసులో జోతిష్య శాస్త్రం అంశాన్ని ప్రస్తావించడంలో ఔచిత్యమేంటని ప్రశ్నించింది. జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ పంకజ్ మిథాల్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు పూర్తిగా సందర్భోచితంగా లేదని, ఈ కేసులో గోప్యత హక్కుకు భంగం కలిగిస్తోందని ధర్మాసనం పేర్కొంది.
అయితే, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. ఉత్తర్వు ఆందోళనకు గురి చేస్తుందని, దానిపై స్టే విధించవచ్చన్నారు. కేసులో ఇతర మెరిట్ల ఆధారంగా బెయిల్ను హైకోర్టు పరిగణించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే.. పెళ్లి సాకుతో ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి సంబంధించిన బెయిల్ సంబంధించిన కేసులో లక్నో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. లైంగిక దాడి కేసు విషయంపై అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ విచారణ విచారణ జరిపింది. అయితే, కేసులో నిందితుడైన గోవింద్ రాయ్ అలియాస్ మోనుకు, బాధిత యువతికి పెళ్లి నిశ్చయమైంది.
ఆ ఇద్దరు పలుసార్లు మాట్లాడుకోవడంతో పాటు శారీరకంగా కలిశారు. ఆ తర్వాత యువతి జాతకంలో మాంగళ్య దోషం ఉందని పెళ్లికి తిరస్కరించారు. దోషం ఉన్న వారు పెళ్లికి అనుకూలం కాదని, పెళ్లి జరిగితే జీవిత భాగస్వామికి హాని జరిగే ప్రమాదం ఉందని కోర్టులో బాధిత కుటుంబం తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ మేరకు సింగిల్ బెంచ్కు చెందిన జస్టిస్ బ్రిజ్రాజ్ సింగ్ లక్నో విశ్వ విద్యాలయం జోత్యిష్య విభాగం నుంచి యువతికి సంబంధించి జన్మ కుండలిని సమర్పించాలని ఆదేశించింది. మూడు వారాల్లోగా సీల్డ్ కవర్లో కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.