న్యూఢిల్లీ: సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ పరీక్షలను (exams) హైబ్రిడ్ (ఆన్లైన్, ఆఫ్లైన్)విధానంలో నిర్వహించాలని ఆయా బోర్డులను ఆదేశించలేమని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణకు బోర్డులు అన్ని చర్యలు తీసుకొన్నాయని, ఈ పరిస్థితుల్లో ఆఫ్లైన్ పరీక్షల ప్రక్రియకు భంగం కలిగించలేమని జస్టిస్ ఏఎమ్ ఖన్విల్కర్, జస్టిస్ సీటీ రవికుమార్ నేతృత్వంలోని బెంచ్ తేల్చిచెప్పింది. మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 10, 12 తరగతుల టర్మ్ 1 పరీక్షలను ఆఫ్లైన్, ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించేలా సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ బోర్డులను ఆదేశించాలని ఆరుగురు విద్యార్థుల బృందం పిటిషన్ దాఖలు చేసింది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పరీక్షలు ప్రారంభమయ్యాయని, అధికారులు తీసుకొన్న చర్యలపై నమ్మకం ఉంచాలని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: బలవంతపు వసూళ్లు, ఇతర కేసుల్లో నిందితుడైన ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరం బీర్ సింగ్కు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కొన్ని నెలల నుంచి కనిపించకుండాపోయిన అతడు తన న్యాయవాది ద్వారా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘ముందు నీవు ఎక్కడ ఉన్నావో తెలియాలి. అప్పటి వరకు నీ పిటిషన్పై విచారణ జరుపం. నీకు రక్షణ కల్పించాలని ఆదేశించం’ అని పరంబీర్కు కోర్టు స్పష్టం చేసింది.