న్యూఢిల్లీ, అక్టోబర్ 18: బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషలను విడుదల చేయడాన్ని సమర్థించుకొంటూ గుజరాత్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అఫిడవిట్ తీరును తప్పుబట్టింది. ‘ఇటువంటి అఫిడవిట్ను నేను ఎన్నడూ చూడలేదు. కుప్పలు తెప్పలుగా గత తీర్పులను ప్రస్తావించారు. ఫ్యాక్చువల్ స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి. భారీ అఫిడవిట్ అయితే ఇచ్చారు కానీ, ఫ్యాక్చువల్ స్టేట్మెంట్లు ఎక్కడ?’ అని న్యాయమూర్తి జస్టిస్ రస్తోగి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు బుర్ర పెట్టే ఈ అఫిడవిట్ను తయారు చేశారా? అని ఘాటుగా స్పందించారు. దోషుల విడుదలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. గుజరాత్ ప్రభుత్వ అఫిడవిట్పై స్పందించేందుకు పిటిషన్దారులకు సమయం ఇచ్చింది. కేసు తదుపరి విచారణను నవంబర్ 29కు వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదంతోనే బిల్కిస్ బానో రేపిస్టులను విడుదల చేసినట్టు గుజరాత్ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దోషులు 14 ఏండ్ల శిక్షాకాలం పూర్తి చేసుకున్నారని, జైలులో సత్ప్రవర్తన కలిగి ఉన్నారని, అందుకే వారి విడుదలకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
రేపిస్టులు, పసివాళ్లను చంపే దుర్మార్గులను రాజకీయ లబ్ధి కోసం విడుదల చేయడం బీజేపీ నీచ రాజకీయాలకు నిదర్శనమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు విమర్శించారు. “బిల్కిస్ బానో అత్యాచార దోషుల విడుదలలో షాకింగ్ విషయాలు బయటికి వచ్చాయి. ఇప్పటి వరకు గుజరాత్ ప్రభుత్వమే ఈ ‘సంస్కారవంతమైన రేపిస్టుల’ను విడుదల చేసిందనే వార్తలొచ్చాయి. కానీ షాకింగ్ విషయం ఏమిటంటే.. దీనికి కేంద్ర ప్రభుత్వమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ఇది చవకబారు రాజకీయం” అని ట్విట్టర్లో పేర్కొన్నారు.