Supreme Court | స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (SIMI)పై విధించిన నిషేధానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే, అత్యవసర విచారణ సాధ్యం కాదంటూ సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. ఆర్టికల్ 370 అంశంపై కోర్టు విచారించనుందని, ఆ తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని న్యాయమూర్తులు ఎస్కే కౌల్, సుధాన్షు ధూలియా ధర్మాసనం న్యాయవాదికి సూచించింది. అయితే, అంశం జనవరి 18న విచారణకు వచ్చిందని, అప్పటి నుంచి జాబితా చేయలేదని సిమి తరఫున న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.
వచ్చేవారం రాజ్యాంగ ధర్మాసనం ఆర్టికల్ 370పై విచారణ ప్రారంభించనుందని, కేసు విచారణ తర్వాత ప్రస్తావించాలని సూచించింది. భారత్లో ఇస్లామిక్ పాలనను నెలకొల్పాలని సిమి లక్ష్యంగా పెట్టుకుందని, నిషేధిత సంస్థ కార్యకర్తలు ఇప్పటికీ దేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేంద్రం గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది. సంస్థ కార్యకర్తలు ఇతర దేశాల్లో ఉన్న వారి సహచరులు, మాస్టర్స్తో ‘రెగ్యులర్ టచ్’లో ఉన్నారని, వారి చర్యలు భారత్లో శాంతి, మత సామరస్యానికి విఘాతం కలిగిస్తాయని గతంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది.
బ్యాన్ విధించినా సిమి కార్యకర్తలు సమావేశాలు నిర్వహిస్తూ కుట్రలకు పాల్పడుతూ, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సేకరించడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పలు ఆధారాలు రుజువు చేస్తున్నాయని పేర్కొంది. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో 1977 ఏప్రిల్ 25న సిమి ఉనికిలోకి వచ్చిందని, 1993లో అది స్వతంత్రంగా ప్రకటించుకున్నట్లు కేంద్రం పేర్కొంది. 2001 తొలిసారిగా సిమిపై నిషేధం విధించగా.. ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు పొడిగిస్తూ వచ్చింది. చివరిసారిగా జనవరి 31, 2019లో గతంలో విధించిన బ్యాన్ను మరో ఐదేళ్లు పొడిగిస్తూ హోంమంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.