న్యూఢిల్లీ: బ్రిటీష్ కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న తరుణంలో.. ఇప్పుడు అలాంటి చట్టాలు అవసరమా అని కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. దేశద్రోహ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో దాఖలైన కేసులో కోర్టు ఈ రకంగా స్పందించింది. ఆ చట్టాన్ని స్వాతంత్య్ర సమరయోధులపై వాడినట్లు కేంద్రానికి కోర్టు తెలిపింది. స్వాతంత్య్ర పోరాటాన్ని అణిచివేసేందుకు దేశద్రోహ చట్టాన్ని బ్రిటీషర్లు వాడినట్లు కోర్టు పేర్కొన్నది. మహాత్మా గాంధీ, బాల్ గంగాధర్ తిలక్ లాంటి వారిపై ఆ కేసులను పెట్టారని కోర్టు తెలిపింది. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత ఇలాంటి చట్టం అవసరమా అని కోర్టు పేర్కొన్నది. దేశద్రోహ చట్టాన్ని సవాల్ చేస్తే అనేక పిటీషన్లు దాఖలైనట్లు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. అన్నింటినీ ఒకేసారి విచారిస్తామని కోర్టు తెలిపింది. ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తారన్నదే తమ ఆందోళన అని చీఫ్ జస్టిస్ తెలిపారు.