Kiren Rijiju | ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాల విషయమై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కార్యనిర్వాహక నియామకాల విషయంలో న్యాయమూర్తులు, న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటే.. న్యాయవ్యవస్థను పట్టించుకునే వారెవ్వరని ప్రశ్నించారు. ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ వ్యవస్థల పనిపై రాజ్యంగం స్పష్టమైన ‘లక్ష్మణరేఖ’ విధించిందని శనివారం ఇండియా టూడే నిర్వహించిన సదస్సులో చెప్పారు.
కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కమిషనర్ల నియామకానికి కమిటీ ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల ఎంపికకు ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభలో ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీని నియమించాలని కేంద్రానికి ఇటీవల అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో సూచించింది. దీనిపై ఇండియా టూడే సదస్సులో కిరణ్ రిజిజు స్పందించారు.
‘ఎన్నికల కమిషనర్ల నియామకంపై రాజ్యాంగంలో స్పష్టంగానే ఉంది. దీనిపై పార్లమెంట్ చట్టం చేయాలి. దానికి అనుగుణంగా నియామకాలు చేయాలి. కానీ పార్లమెంట్ ఆ చట్టం చేయకపోవడంతో శూన్యత ఉందని అంగీకరిస్తున్నా. ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టడం లేదు. అయితే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఇతర జస్టిస్లు దేశంలోని కీలక వ్యవస్థల నియామకాలపై జోక్యం చేసుకుంటే, న్యాయ వ్యవహారాలు చూసేదెవరు?’ అని రిజిజు ప్రశ్నించారు.
‘దేశంలో చాలా అంశాల్లో పాలనాపరమైన ఇబ్బందులున్నాయి. అయినా న్యాయ వ్యవహారాలు చూస్తూ తీర్పులు చెప్పడం, ప్రజలకు న్యాయం చేయడం న్యాయమూర్తుల ప్రాథమిక విధి’ అని కిరణ్ రిజిజు చెప్పారు. పాలనాపరమైన వ్యవహారాల్లో న్యాయమూర్తులు జోక్యం చేసుకుంటే వారిపైనే విమర్శలు వస్తాయన్నారు. కేసుల విచారణ టైంలో న్యాయ సూత్రాలు పాటించడంలో రాజీ పడాల్సి వస్తుందన్నారు.