న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. 13 ఏళ్లుగా అచేతన స్థితిలో ఉన్న ఓ వ్యక్తి కారుణ్య మరణానికి కోర్టు ఆదేశించింది. 32 ఏళ్ల హరీశ్ రాణా అనే వ్యక్తి.. 2013లో బిల్డింగ్ మీద నుంచి కింద పడి కోమాలోకి వెళ్లాడు. అయితే లైఫ్ సపోర్టుపై అతనికి చికిత్స కొనసాగిస్తున్నారు. ఆ కేసులో పాసివ్ యుథనేసియాకు కోర్టు అనుమతి ఇచ్చింది. జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథ్తో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఆదేశాలు ఇచ్చింది.
లైఫ్ సపోర్టింగ్ చికిత్స పొందుతున్న హరీశ్ రాణా తండ్రి అశోక్ రాణా దాఖలు చేసిన పిటీషన్ ఆధారంగా కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో జనవరి 15వ తేదీన కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. అయితే హరీశ్ రాణాకు కొనసాగిస్తున్న లైఫ్ సపోర్టు చికిత్సను ఉపసంహరించాలని కోర్టు తన తీర్పులో పేర్కొన్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ హరీశ్ రాణా కోలుకునే అవకాశం లేదని గతంలో రెండు మెడికల్ బోర్డులు పేర్కొన్నాయి. లైఫ్ సపోర్టు చికిత్సను నిలిపివేయాలని ఆ మెడికల్ బోర్డులు సూచించాయని, ఈ దశలో కోర్టు జోక్యం అవసరం లేదని, కానీ ఇది తొలి కేసు కాబట్టి, కోర్టుకు రిఫర్ చేయాల్సి వచ్చిందని బెంచ్ పేర్కొన్నది. చాలా మార్యాదపూర్వకర రీతిలో లైఫ్ సపోర్టును తొలగించాలని కోర్టు తన ఆదేశాల్లో వెల్లడించింది.
పంజాబ్ యూనివర్సిటీలో హరీశ్ రాణా పెయింగ్ గెస్ట్గా ఉన్న సమయంలో.. 2013లో నాలుగవ అంతస్తు నుంచి కింద పడిపోయాడు. అతనికి తీవ్ర స్థాయిలో గాయాలయ్యాయి. మెదడుకు గాయం కావడం వల్ల అప్పటి నుంచి అతనికి లైఫ్ సపోర్టు చికిత్సను అందిస్తున్నారు. బెడ్ మీద ఉండి అచేతన స్థితిలో చికిత్సను పొందుతున్నాడు. ట్రాకోస్టోమీ ట్యూబ్ ద్వారా ఊపిరి పీల్చుకుంటున్నాడు. గ్యాస్ట్రోజీజునోస్టమీ ట్యూబ్ ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారు. అయితే 13 ఏళ్లుగా చికిత్స వల్ల ఎటువంటి మార్పు జరగలేదని మెడికల్ బోర్డులు రెండు సార్లు చెప్పాయి.