న్యూఢిల్లీ, అక్టోబర్ 4: జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) సిఫారసు చేసినట్టుగా కొవిడ్-19 మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం చెల్లించాల్సిందేనని సోమవారం సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కరోనాతో చనిపోయినట్టు మరణ ధ్రువీకరణ పత్రంలో లేకపోయినా పరిహారాన్ని ఏ రాష్ట్రం నిరాకరించడానికి వీల్లేదని, దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ పథకం గురించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారాన్ని చెల్లించేందుకు ఎన్డీఎంఏ రూపొందించిన మార్గదర్శకాలను జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమోదించింది. మరణ ధ్రువీకరణ పత్రాలు ఇప్పటికే జారీ అయితే వాటిలో మార్పుల కోసం బాధితులు సంబంధిత విభాగాన్ని సంప్రదించవచ్చని తెలిపింది. బాధితులు ఆర్టీపీసీఆర్ పరీక్ష నివేదిక లాంటి ముఖ్యమైన పత్రాలను సమర్పించాక అధికారులు మరణ ధ్రువీకరణ పత్రాల్లో మార్పులు చేయవచ్చని, అయినా సమస్య పరిష్కారం కాకపోతే బాధితులు గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీని సంప్రదించాలని పేర్కొన్నది. కొవిడ్-19 సహాయక చర్యల్లో పాల్గొంటూ కరోనా వల్ల మరణించినవారి కుటుంబాలకు కూడా పరిహారం చెల్లించాలని ఆదేశించింది.