న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు ఇస్తున్న తీర్పులపై .. అత్యున్నత న్యాయస్థానం(Supreme Court) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ హైకోర్టు నుంచి ఇటీవల వెలుబడిన కొన్ని తీర్పులను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. తన సమస్యను తానే కొని తెచ్చుకున్నట్లు ఇటీవల ఓ కేసు తీర్పు సమయంలో రేప్ బాధితురాలని అలహాబాద్ హైకోర్టు తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఇవాళ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మహిళలపై లైంగిక దాడి జరుగుతున్న కేసుల్లో.. తీర్పులు ఇస్తున్న జడ్జీలు అనుచిత వ్యాఖ్యలు చేయరాదు అని సుప్రీంకోర్టు తెలిపింది.
జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాషిలతో కూడిన ధర్మాసనం.. ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా తప్పుపట్టింది. కేసు విషయంలో బెయిల్ ఇచ్చే అధికారం పూర్తిగా జడ్జి ఆధీనంలోనే ఉంటుందని, ఆ కేసుకు చెందిన సాక్ష్యాల ఆధారంగా బెయిల్ ఇవ్వవచ్చు అని, కానీ బాధితులపై అనవసరమైన వ్యాఖ్యలు చేయరాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు జడ్జీలు చాలా జాగ్రత్తగా ఉండాలని జస్టిస్ గవాయి తెలిపారు.
వీ ద వుమెన్ ఆఫ్ ఇండియా సంస్థ దాఖలు చేసిన సుమోటో కేసుపై విచారణ చేపడుతూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. చేతులతో మైనర్ను వేధించడం, పైజామా విప్పడం లాంటి చర్యలు అత్యాచారం యత్నం కిందకు రావు అని ఓ కేసులో హైకోర్టు ధర్మాసనం చెప్పడాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టింది.