న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మజీద్ మెమన్ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. ఈ సందర్భంగా ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ‘పులి’ అని ఆయన అభివర్ణించారు. ప్రజాస్వామ్యాన్ని, దేశ ధర్మాన్ని పరిరక్షించడానికే తాను టీఎంసీలో చేరినట్లు ఆయన తెలిపారు. ‘టీఎంసీ నాయకురాలి(మమత)ది పులి గొంతు. పశ్చిమ బెంగాల్లోనే కాదు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. లోటుపాట్లు ఉన్నప్పటికీ డబ్బు, కండబలాన్ని ఆమె ఎదుర్కొన్నారు’ అని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా శాంతిభద్రతలను కేంద్ర ఏజెన్సీలు దుర్వినియోగం చేస్తున్నాయని విమర్శించారు. ఈ తరుణంలో తృణమూల్ దానిని సవాల్ చేస్తున్నదని అన్నారు.
కాగా, తమ పార్టీ బలపడుతోందని టీఎంసీ పేర్కొంది. ‘తృణమూల్ కుటుంబం బలపడుతోంది. ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో, ప్రముఖ క్రిమినల్ లాయర్, ఎన్సీపీ మాజీ ఎంపీ మజీద్ మెమన్ ఇవాళ ఢిల్లీలో ఎంపీ సౌగత్ రాయ్, పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ డెరెక్ ఒబ్రియన్ సమక్షంలో టీఎంసీలో చేరారు’ అని ట్వీట్ చేసింది.
మరోవైపు రాజ్యసభ మాజీ సభ్యుడైన మజీద్ మెమన్ ఇటీవల శరద్ పవర్ నేతృత్వంలోని ఎన్సీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆ పార్టీని వీడినట్లు తెలిపారు. అయితే మరోసారి రాజ్యసభకు అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన అసంతృప్తితో ఎన్సీపీని వీడినట్లు తెలుస్తున్నది.
Trinamool family grows stronger.
With a vision to serve people, eminent criminal lawyer and former Rajya Sabha MP of NCP, Shri Majeed Memon joined us in New Delhi today in the presence of MP Shri Saugata Roy and Parliamentary Party Leader, Rajya Sabha, Shri @derekobrienmp. pic.twitter.com/Hq9rsbV7T5
— All India Trinamool Congress (@AITCofficial) December 14, 2022