Supreme Court : నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్నవారిపై నమోదైన ఎఫ్ఐఆర్లను సుప్రీంకోర్టు రద్దు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142ను ఉపయోగించి కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆందోళనల్లో పాల్గొన్న యువత, విద్యార్థులకు భారీ ఊరట లభించినట్లైంది. ఈ మేరకు సుప్రీంకోర్టు మంగళవారం నిర్ణయం తీసుకుంది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని బెంచ్ ఈ తీర్పు వెల్లడించింది. ఢిల్లీ, అసోం, పశ్చిమ బెంగాల్, బిహార్ సహా వివిధ రాష్ట్రాల్లో ఆందోళనలపై నమోదైన ఎఫ్ఐఆర్లను కోర్టు కొట్టివేసింది. ఢిల్లీ పరిధిలో జంతర్మంతర్ వద్ద జూలై 20-25 వరకు జరిగిన నిరసనలపై 13 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అయితే, ఈ ఆందోళనల్లో పాల్గొన్న వారిపై ఎలాంటి కేసులు ఉండవు. కానీ, ఈ నిర్ణయం అందరికీ వర్తించదు. గతంలో క్రిమినల్ కేసులు ఉన్నవారిపై మాత్రం ఎఫ్ఐఆర్లు కొనసాగుతాయి. అలా, 2,873 మందిపై నమోదైన ఎఫ్ఐఆర్లు మాత్రం కొనసాగుతాయని కోర్టు తెలిపింది.
నీట్ ఆందోళనలపై అన్ని రాష్ట్రాల్లో నమోదైన కేసులు కొట్టివేయాలని ప్రభుత్వాలను ఆదేశించింది. మరోవైపు నీట్ పేపర్ లీకేజీ కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించే విషయంపై కూడా సుప్రీంకోర్టు స్పందించింది. పరిహారం అందించేందుకు మూడు నెలల్లో విధి విధానాలు రూపొందిస్తామని ప్రభుత్వం తెలిపినట్లు కోర్టు వ్యాఖ్యానించింది.