న్యూఢిల్లీ : దేశ అత్యున్నత న్యాయస్థానానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ‘కొలీజియం’ విషయంలో వివాదం కొనసాగుతున్నది. సుప్రీంకోర్టు సహా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల ఎంపిక సుప్రీంకోర్టు కొలీజియం ద్వారానే జరుగుతుంది. సుప్రీం కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను కేంద్రం ఆమోదించాల్సి ఉంటుంది. నిజానికి ఇదో లాంఛన ప్రక్రియ అయినప్పటికీ కేంద్రం మాత్రం కొలీజియం సూచించిన పేర్లలో కొన్నింటికే ఆమోదం తెలపడం, మరికొన్నింటి విషయంలో పెండింగులో పెడుతుండడంపై జస్టిస్ సంజయ్ కిషన్కౌల్, జస్టిస్ సుధాంశు ధులాయ్ కూడిన ధర్మాసనం కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 40 శాతం రాష్ర్టాలు ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్నాయన్న వాస్తవాన్ని కేంద్రం గుర్తించాలని, న్యాయాధికారుల పదవులను కలిగి ఉన్న వ్యక్తులకు పార్టీలతో కొంత అనుబంధం కలిగి ఉండొచ్చని భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకరమణికి సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. కొలీజియం ప్రతిపాదించిన లాయర్లు రాజకీయంగా క్రియాశీలకంగా ఉండకపోయినా అధికార పార్టీతోనో, ప్రతిపక్ష పార్టీతోనే సంబంధం కలిగి ఉండొచ్చని పేర్కొంది. ఓ క్రిమినల్ లాయర్ ప్రజల పక్షాన వాదించినంత మాత్రాన ఆయన ఇంకెవరికీ వ్యతిరేకం కాబోడని జస్టిస్ కౌశల్ స్పష్టం చేశారు. కాబట్టి ‘పిక్ అండ్ చూజ్(కావాల్సిన వారిని ఎంపిక చేసుకోవడం)’ విధానానికి స్వస్తి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.