Supreme Court | రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ను 2018 జనవరి 2న కేంద్రం నోటిఫై చేసిన విషయం తెలిసిందే. రాజకీయ పార్టీల నిధుల విషయంలో పారద్శకత తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగంగా.. పార్టీలకు నగదు విరాళాలకు ప్రత్యామ్నాయంగా పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకం నిబంధనల ప్రకారం.. ఎలక్టోరల్ బాండ్లను భారతదేశంలోని ఏ పౌరుడైనా.. దేశంలో స్థాపించిన ఏ సంస్థ అయినా ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు.
ఒకరైనా.. ఇతరులతో కలిసి అయినా ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ స్కీమ్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నాయకురాలు జయ ఠాకూర్, సీపీఐ ఎం, ఎన్జీఓ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ (ADR) పిటిషన్లు ఉన్నాయి. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏడీఆర్ తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ.. ఇది మన ప్రజాస్వామ్య మూలాల్లోకి వెళ్లాల్సిన అంశమని పేర్కొన్నారు. అయితే, ఇంతకు కేంద్రం తరఫున సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఎన్నికల విరాళాలు స్వీకరించడానికి ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ చట్టబద్ధతను సమర్థిస్తూ.. రాజకీయ పార్టీలకు ఎన్నికల విరాళాల మూలాన్ని తెలుసుకునే ప్రాథమిక హక్కు ప్రజలకు లేదన్నారు. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్లో దాత గోపత్యకు సంబంధించిన ప్రయోజనం పొందుతారని.. పథకం రాజ్యాంగంలోని ఆర్టికల్ ఆర్టికల్ 19(2) పరిధిలో ఉందని పేర్కొంటూ రాజకీయ పార్టీల నిధుల విషయంలో పారదర్శకత కోసం పిటిషనర్లు లేవనెత్తిన వాదనలను ఏజీ వ్యతిరేకించారు. కొన్ని ప్రయోజనాల కోసం భావవ్యక్తీకరణకు తెలుసుకునే హక్కు అవసరమన్నారు. రాజ్యాంగం ప్రకారం అభ్యర్థుల పూర్వాపరాలను మాత్రమే తెలుసుకునేందుకు ప్రజలకు హక్కు ఉంటుందని.. అయితే ప్రతీది తెలుసుకునే హక్కు లేదన్నారు.