నిరుడు మహారాష్ట్రలో మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వాన్ని కూల్చిన ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శివసేన సంక్షోభ సమయంలో బలపరీక్షపై గవర్నర్ కోశ్యారీ నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపట్టిన న్యాయస్థానం.. పార్టీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నది. బలనిరూపణకు ముందే స్వచ్ఛంద రాజీనామా చేసిన నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే సర్కారును పునరుద్ధరించలేమని స్పష్టంచేసింది.
Supreme court | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): దేశ రాజకీయాల్లో కిందటేడాది సంచలనం సృష్టించిన శివసేన సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహా వికాస్ ఆఘాడీ (ఎంవీఏ) నుంచి ఎమ్మెల్యేలు బయటికి వెళ్లారన్న సమాచారం లేనప్పటికీ అప్పటి గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ బలపరీక్ష నిర్ణయాన్ని తీసుకోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. బలపరీక్షకు వెళ్లకుండానే అప్పటి సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్వచ్ఛందంగా రాజీనామా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసిన ధర్మాసనం.. ఈ కారణంగానే ఆయన ప్రభుత్వాన్ని మళ్లీ పునరుద్ధరించలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ డీవై చంద్రచూడ్తో కూడిన ఐదుగురు సభ్యులున్న రాజ్యాంగ ధర్మాసనం 141 పేజీల తీర్పులో కీలక వ్యాఖ్యలు చేసింది. తీర్పునిచ్చిన ధర్మాసనంలో జస్టిస్లు ఎంఆర్ షా, కృష్ణ మురారి, హిమాకోహ్లీ, పీఎస్ నరసింహ సభ్యులుగా ఉన్నారు.