న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: గుజరాత్లోని గోద్రా-2002 రైలు దహనం కేసులో 8 మంది నిందితులకు సుప్రీం కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో నేర తీవ్రత దృష్ట్యా మరో నలుగురి బెయిల్ను తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించి 8 మంది ఇప్పటికే 17 ఏండ్ల కారాగార శిక్షను అనుభవించినందున వారికి బెయిల్ మంజూరు చేస్తున్నట్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. తొలుత సోమవారం ఈ కేసును విచారించిన సుప్రీం నిందితుల బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది.
నిందితులు రైలు తలుపునకు బయట నుంచి బోల్టు పెట్టి ప్రయాణికులు బయటకు రాకుండా చేశారని, వారి నేర తీవ్రత దృష్ట్యా బెయిల్ ఇవ్వరాదంటూ గుజరాత్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. అయితే నిందితులు ఇప్పటికే 17 ఏండ్ల జైలు శిక్షను అనుభవించినందున వారికి బెయిల్ మంజూరు చేయాలంటూ వారి తరఫు లాయర్ కోర్టుకు విన్నవించడంతో సుప్రీం 8 మందికి బెయిల్ మంజూరు చేసింది. అయితే నేర తీవ్రతను పరిగణనలోకి తీసుకుని మరో నలుగురికి బెయిల్ తిరస్కరించింది.