న్యూఢిల్లీ: డ్రగ్స్ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఒక నిందితుడికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తన తండ్రి అనారోగ్యంతో ఉన్నాడని, ఆయనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్రచికిత్స చేయాలని సుప్రీంకోర్టుకు నిందితుడు తెలియజేశాడు. తాను కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, అందువల్ల తనకు బెయిలు ఇవ్వాలని నిందితుడు కోరాడు. ఈ పిటిషన్పై వాదనలు విన్న కోర్టు నిందితుడిని మెడికల్ టెస్టుల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లాలని పోలీసులను ఆదేశించింది.
ప్రభుత్వ మెడికల్ కాలేజిలో కనుక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు అనుమతినిస్తే మధ్యప్రదేశ్ హైకోర్టు ముందు మధ్యంతర బెయిలు కోసం నిందితుడు దరఖాస్తు చేసుకోవచ్చని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ను కోర్టు కూడా సానుభూతితో పరిశీలించాలని సూచించింది నేరం తీవ్రత, అలాగే తండ్రి బాగోగులు చూసుకోవడానికి నిందితుడి తోబుట్టువులు ఉన్నారని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు.
తండ్రి బాగోగులు చూసుకోవడం, కిడ్నీ దానం చేయడం వేరువేరని జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. అందరు సంతానం, ముఖ్యంగా పెళ్లిళ్లు చేసుకొని పిల్లలు కలిగిన వారు తండ్రికి కిడ్నీ ఇవ్వడానికి ముందుకు రాకపోవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. కాబట్టి టెస్టుల కోసం అవసరమైనప్పుడు నిందితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లాలని పోలీసు శాఖను ఆదేశించింది.