న్యూఢిల్లీ: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు(Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. డీఎంకే నేత పొన్ముడిని మళ్లీ మంత్రిగా నియమించేందుకు గవర్నర్ అంగీకరించకపోవడంతో అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహానికి లోనైంది. ఒకవేళ గవర్నరే రాజ్యాంగాన్ని అనుసరించకపోతే, అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందని సీజేఐ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు. జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తీర్పును ఇచ్చింది. కే పొన్ముడిని మళ్లీ మంత్రిగా నియమించేందుకు గవర్నర్కు ఒక రోజు సమయాన్ని కేటాయిస్తున్నామని ధర్మాసనం తెలిపింది. పొన్ముడిని మంత్రిగా పునర్ నియమించేందుకు గవర్నర్ ఎన్ రవి తిరస్కరించడంతో.. తమిళనాడు సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ చర్య రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నట్లు స్టాలిన్ ఆరోపించారు. అక్రమాస్తుల కేసులో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును లేవనెత్తుతూ పొన్ముడిని ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించారు.ఆయనకు విధించిన జైలు శిక్షకు కూడా సుప్రీం బ్రేక్ వేసింది. ఈ నేపథ్యంలో పొన్ముడిని మళ్లీ మంత్రిగా నియమించేందుకు ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నాలను గవర్నర్ అడ్డుకున్నారు.