న్యూఢిల్లీ: యూపీఎస్సీ పరీక్ష చీటింగ్ కేసులో ఐఏఎస్ ట్రైనింగ్ అధికారి పూజా ఖేద్కర్(Puja Khedkar)కు సుప్రీంకోర్టు తాత్కాలిక రక్షణ కల్పించింది. ఆ ట్రైనీ అధికారిని మార్చి 17వ తేదీ వరకు అరెస్టు చేయవద్దు అంటూ మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది. 2022 యూపీఎస్సీ పరీక్షలో పూజా ఖేద్కర్ తప్పుడు కుల, అంగవైకల్య ద్రువపత్రాలు సమర్పించి ఐఏఎస్ శిక్షణ పొందిన విషయం తెలిసిందే. ఆ కేసు విచారణకు సహకరించాలని పూజాను సుప్రీం ధర్మాసనం కోరింది.
సుప్రీం బెంచ్లో జస్టిస్ బీవీ నాగర్నత, సతీశ్ చంద్ర శర్మ ఉన్నారు. విచారణపై రిప్లే ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు సుప్రీంను కోరారు. పూజా ఖేద్కర్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుత్రా వాదిస్తున్నారు. దర్యాప్తుకు రావాలని పోలీసులు పూజాను పిలవడం లేదని, విచారణ ఎదుర్కొనేందుకు ఆమె సిద్ధంగా ఉన్నట్లు న్యాయవాది సిద్ధార్థ తెలిపారు. ఈ కేసుపై మూడు వారాల్లోగా రిప్లై ఇవ్వాలని అదనపు సొలిసిటర్ జనరల్ను కోర్టు ఆదేశించింది.