Supreme Court | దేశంలో పెరుగుతున్న జనాభాను నియంత్రించేందుకు ‘ఇద్దరు పిల్లలు’ నిబంధనను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. సమస్య పరిష్కారం ప్రభుత్వం పని అని, కోర్టు జోక్యం చేసుకోవాల్సిన సమస్య కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. జనాభా ఒక్కరోజులో ఆగిపోయేది కాదని జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఈ అంశం లా కమిషన్ నివేదిక చాలా ముఖ్యమైందని పిటిషనర్లలో ఒకరైన న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. అయితే, ఇంతకు ముందు ఈ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు సైతం కొట్టివేసింది. ఢిల్లీ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాకలు చేశారు. పిటిషన్ను స్వీకరించేందుకు ఇష్టం లేదని సర్వోన్నత న్యాయస్థానం చెప్పడంతో ఆయన ఉపసంహరించుకున్నారు. ఈ అశ్వినికుమార్ పిటిషన్తో పాటు మరికొన్ని పిటిషన్లను సైతం విచారించేందుకు ధర్మాసనం నిరాకరించగా.. న్యాయవాదులు ఆయా పిటిషన్లను వెనక్కి తీసుకున్నారు.
ఈ అంశంపై సమగ్ర నివేధికను సిద్ధం చేయమని లా కమిషన్ను ఆదేశించడమే తన పిటిషన్ ఉద్దేశమని ఉపాధ్యాయ్ కోర్టుకు తెలిపారు. దీనిపై లా కమిషన్ ఎలా నివేదికను సిద్ధం చేస్తుందని కోర్టు ప్రశ్నించింది. ఇందులో అనేక సామాజిక, కుటుంబ సమస్యలు ఇమిడి ఉన్నాయన్న కోర్టు.. వాటిలోకి వెళ్లలేమని పేర్కొంది. ఇది మనం (కోర్టు) జోక్యం చేసుకోవాల్సిన సమస్యా? అని ప్రశ్నించింది.