న్యూఢిల్లీ : విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం తీసుకువచ్చిన పదిశాతం EWS
రిజర్వేషన్లపై ఈ నెల సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనున్నది. ప్రస్తుతం రిజర్వేషన్ ఉన్న వర్గాలకు కాకుండా ఇతర వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వారికి లబ్ధి చేకూరేందుకు ‘ఎకనామిక్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్’ (EWS) పేరుతో కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. అయితే, రిజర్వేషన్లు భారత రాజ్యాంగ మౌలిక సూత్రానికి వ్యతిరేకమంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవగా.. గత నెలలో వాదనలు విన్న సుప్రీంకోర్టు.. తీర్పును రిజర్వు చేసింది.
పదిశాతం EWS రిజర్వేషన్ల చెల్లుబాటుపై సోమవారం ఉదయం 10.30 గంటలకు సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వనున్నది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ ధర్మాసనంతో పాటు సీజేఐ యూయూ లలిత్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ బేల ఎం త్రివేది, జస్టిస్ జేబీ పార్దివాలా ధర్మాసనాలు వేర్వేరు తీర్పులను వెలువరించనున్నాయి. ఈ నెల 8న సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ ఈ నెల 8న పదవీ విరమణ చేయనున్నారు.
ఈ క్రమంలో రిజర్వేషన్ల చెల్లుబాటుపై తీర్పును వెలువరించే అవకాశం ఉన్నది. EWS కోటా అమలు కోసం కేంద్ర ప్రభుత్వం 2019లో 103వ రాజ్యాంగ సవరణ చేపట్టి.. రిజర్వేషన్లను అమలులోకి తీసుకువచ్చింది. ఈ అయితే, ఈ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల్లో కూడా పేదలు ఉన్నారని, అలాంటప్పుడు సాధారణ కేటగిరీ వారికి మాత్రమే ఎందుకు రిజర్వేషన్లు కల్పిస్తారని పిటిషన్లో ప్రశ్నించారు. 50 శాతం రిజర్వేషన్ నిబంధనను ఉల్లంఘించడమేనని, ఇప్పటికే ఓబీసీలకు 27 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం కోటా నిర్ణయించారని, 10శాతం EWS కోటా 50 శాతం నిబంధనను ఉల్లంఘిస్తుందని పిటిషనర్లు పేర్కొన్నారు.