న్యూఢిల్లీ, మే 18: ఢిల్లీలో 2020లో చోటుచేసుకున్న అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న విద్యార్థి సంఘం నాయకులు ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్కు ఈ ఏడాది జనవరిలో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఇంతకుముందు ఒక కేసులో సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల ధర్మాసనం నిర్దేశించిన ఒక కట్టుబాటును ద్విసభ్య ధర్మాసనం ఎందుకు నిర్లక్ష్యం చేసిందని ప్రశ్నించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం (ఉపా) కేసుల విచారణలో తీవ్ర జాప్యం, విచారణకు ముందు సుదీర్ఘకాలం నిర్బంధంలో ఉంచిన సమయంలో బెయిల్ మంజూరు చేయవచ్చని, 2021లో కేఏ నజీబ్ కేసులో త్రిసభ్య ధర్మాసనం తీర్పు చెప్పిందని గుర్తు చేసింది.
విద్యార్థి సంఘం నాయకులకు బెయిల్ నిరాకరించిన సమయంలో ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పును సరిగా అనుసరించలేదని వ్యాఖ్యానించింది. ఉపా కేసులోనే గత ఆరేండ్లుగా కస్టడీలో ఉన్న ఇఫ్తికార్ అంద్రాబీకి బెయిల్ మంజూరు చేసిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనంపై వ్యాఖ్యలు చేసింది. ఉపా కేసుల్లో సుదీర్ఘకాలం జైల్లో ఉంచడం, విచారణలో జాప్యం వంటి కారణాలతో బెయిల్ మంజూరు చేయవచ్చని స్పష్టం చేసింది. ఎక్కువమంది సభ్యులతో కూడిన ధర్మాసనం నిర్దేశించిన న్యాసూత్రాలకు తక్కువమంది సభ్యులు గల ధర్మాసనం ఇచ్చే తీర్పు కట్టుబడి ఉండాలని వ్యాఖ్యానించింది.