న్యూఢిల్లీ : ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గుప్పించే ఉచిత హామీల కట్టడి కోసం అత్యున్నత కమిటీ ఏర్పాటు చేయాలని సర్వోన్నత న్యాయస్ధానం పిలుపు ఇచ్చింది. ఉచితాల నియంత్రణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై నీతి ఆయోగ్, ఫైనాన్స్ కమిషన్, ఆర్బీఐ ప్రతినిధులతో పాటు పాలక, విపక్ష పార్టీల ప్రతినిధులతో ఓ నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఉచిత హామీల ప్రకటనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఉచిత హామీలు ఆర్ధిక వ్యవస్ధపై పెను ప్రభావం చూపనున్నందున వీటి ఉచితానుచితాలను నిపుణుల కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది. ప్రతిపాదిత నిపుణుల కమిటీ ఉచిత హామీలను ఎలా నియంత్రించాలనే దానిపై కేంద్రం, ఈసీ, సుప్రీంకోర్టులకు నివేదికలు సమర్పిస్తాయని కోర్టు స్పష్టం చేసింది. నిపుణుల కమిటీ ఏర్పాటుపై కేంద్రం, ఈసీ, పిటిషనర్లు, సీనియర్ అడ్వకేట్, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్లను వారం రోజుల్లోగా తమ సూచనలు తెలపాలని సుప్రీంకోర్టు కోరింది.
అర్ధం లేని ఉచితాలు దేశ ఆర్ధిక వ్యవస్ధను భ్రష్టు పట్టిస్తాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై చర్చ జరిపి చట్టంతో ముందుకు వచ్చేలా ఉచిత హామీలపై నిర్ణయాన్ని పార్లమెంట్కు విడిచిపెట్టాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోరారు. దీంతో సీజేఐ ఎన్వీ రమణ జోక్యం చేసుకుని ఏ రాజకీయ పార్టీ ఉచితాలను వ్యతిరేకించదని, పార్లమెంట్లో ఈ అంశాన్ని చర్చిస్తారని మీరు భావిస్తున్నారా అని ప్రశ్నించారు. దేశ ఆర్ధిక వ్యవస్ధ, పన్ను చెల్లింపుదారుల గురించి మనం ఆలోచించాలని సూచించారు.