Supreme Court : గ్రామీణ ప్రజాస్వామ్యాన్ని నిరుత్సాహపరిచే అవకాశాన్ని ఉన్నతాధికారులకు ఇవ్వలేమని సుప్రీంకోర్టు (Supreme Court) వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర (Maharastra) లో పదవి నుంచి తప్పించిన ఓ మహిళను తిరిగి గ్రామ సర్పంచిగా నియమిస్తూ గతంలో బాంబే హైకోర్టు (Bombay High Court) ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఇదే కాదని, ఇటీవల పంచాయతీ ప్రతినిధులతో ఉన్నతాధికారులు అనుచితంగా ప్రవర్తించిన అనేక ఘటనలు తమ దృష్టికి వచ్చాయని తెలిపింది.
ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులతో ఉన్నతాధికారులు అనుచితంగా ప్రవర్తించిన రెండు మూడు కేసుల్లో తాము తీర్పులు ఇచ్చామని, మహారాష్ట్రలో ఇలా తరచూ జరుగుతోందని పేర్కొంది. ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అధికారులు ఉండాలని, గ్రామీణ స్థాయి ప్రజాస్వామ్యాన్ని నిరాశపరిచే అవకాశం బ్యూరోక్రాట్లకు ఇవ్వకూడదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది. కొన్ని సందర్భాల్లో ప్రజాప్రతినిధులపై అనర్హతవేటు వేసేందుకు, పాత కేసులను బయటకు తీసేందుకు యత్నిస్తున్నట్లు గుర్తించామని వ్యాఖ్యానించింది.
గత ఏడాది రాయ్గఢ్ జిల్లా రోహా తాలుకాలోని ఐంఘఢ్ గ్రామ సర్పంచి కళావతి రాజేంద్ర కోకలేపై అనర్హత వేటు వేస్తున్నట్లు స్థానిక కలెక్టర్ ప్రకటించారు. అక్కడ కొత్తగా ఎన్నిక నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారిని నియమించారు. ఈ కేసుపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు కలెక్టర్ ఆదేశం చట్టవిరుద్ధమని పేర్కొంటూ జూలై 7, 2024న తీర్పు వెలువరించింది. తాజాగా ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.